భారతదేశంలో పౌరులు ఏ మతాన్నైనా స్వీకరించే, దాన్ని ప్రచారం చేసుకునే హక్కు రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి ఒకనాటి సోకాల్డ్ ముస్లిమైన ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ వసీం రిజ్వీ హిందూ మతాన్ని స్వీకరించటం చెప్పుకోతగ్గ పెద్ద వింతేమీ కాదు.
కాకపోతే ఆలయంలో శివలింగానికి క్షీరాభిషేకం చేసి వేద మంత్రోచ్ఛారణల మధ్య హిందూ మతాన్ని స్వీకరించటం అనే ప్రక్రియే కాస్త బోధపడటం లేదు.
ఎందుకంటే శివలింగానికి క్షీరాభిషేకం చేసి వేద మంత్రోచ్ఛారణల మధ్య హిందూ మతాన్ని స్వీకరించే విధానం ఒకటి వేదోపనిషత్తుల్లో ఎక్కడా లేదు! రెండు అసలు విగ్రహారాధనే వేదోపనిషత్తుల్లో లేకపోగా పైగా వేదాలు విగ్రహారాధనను తీవ్రంగా ఖండిస్తున్నాయి.
అన్నిటికంటే ముఖ్యంగా వేదాల్లో వేదకాలంలో ఉన్న ధర్మం వైదిక ధర్మం తప్పితే హిందూ మతం కాదు. ఇక హిందూ అన్నది భౌగోళిక నామమే (Geographical term) తప్ప అది మతపరమైన పేరు కాదన్నది కనీసం ఆరోతరగతి చదివేవారికి సైతం తెలిసిన విషయమే! కాబట్టి శివలింగానికి క్షీరాభిషేకం చేసి వేద మంత్రోచ్ఛారణల మధ్య హిందూ మతాన్ని స్వీకరించే ప్రక్రియే ముందుగా వేదశాస్త్రానికి వ్యతిరేక ప్రక్రియ అన్నది గమనించాల్సిన విషయం.
దీన్నిబట్టి కొత్తగా హిందూ ధర్మం స్వీకరించిన వసీం రిజ్వీకి పాపం ఇస్లాం అవగాహనే కాదు కనీసం వైదిక ధర్మం యొక్క కనీస అవగాహన సైతం లేదని అర్థమవుతుంది. కాబట్టి వసీం రిజ్వీ ఇస్లాంను వదిలిపెట్టి హిందూత్వం స్వీకరిస్తున్నానని చెప్పటం పోలిటికల్ స్టంటే తప్పితే అవగాహన ఉండి చేస్తున్న పని కాదు.
బహుశా వసీం రిజ్వీకి ఏమాత్రం బుర్రలో గుజ్జు ఉన్నా హిందూ మతం స్వీకరించే ముందు గతంలో ఇస్లాంను ఎలాగూ స్టడీ చేయలేదు గనుక కనీసం వేదోపనిషత్తులు, భాగవద్గీతా శాస్త్రాలు కాస్త స్టడీ చెయ్యాల్సింది. ఎందుకంటే వేదోపనిషత్తులు సృష్టిలో కనపడేవాటిలో దేన్నిపడితే దాన్ని దైవంగా చేసికుని వాటి పట్ల గుడ్డి నమ్మకాలు ఏర్పర్చుకుని పూజలూ పునస్కారాలు ప్రార్ధనలూ చెయ్యమనటం లేదు. మరి నిజమైన వైదికునిగా మారటానికి ఏం చెయ్యమని చెబుతున్నాయి?
“ఈ సృష్టి అంతటికీ దేవుడు ఒక్కడే ఆయన అద్వితీయుడు (అథర్వణవేదం 13:4-21)” అని నమ్మమని చెబుతున్నాయి. “ఆయన అగోచరుడు మనిషి పంచేంద్రియాల పరిధికి నిలిచేవాడు కాడని (శ్వేతాశ్వరోపనిషద్ 4:20)”, “ఆయనకు మానవశరీరం కలిగిన వాడు కాడని (యజుర్వేదం 40:8)”, “ఆయన ఒక్కడే అనేక పేర్లతో పిలువబడ్డాడు” అని చెబుతున్నాయి. గీతాశాస్త్రం సైతం “ఆయన పుట్టడని (10:3)”, “ఆయన చనిపోడని (గీతా 2:17)”, “ఆయన నిర్దేశింప శక్యము కాని రూపం కలవాడని (గీత 12:4)” స్పష్టం చేస్తున్నాయి.
ఒకవేళ వేదోపనిషత్తులు, గీత శాస్త్రాలు పరిచయం చేస్తున్న అటువంటి గుణాలక్షణాలున్న అస్తిత్వాన్ని దైవంగా స్వీకరించి, కంటికి కనబడే దేవీదేవతలనూ, బాబాలూ, బాలసాయిబాబాలను, విగ్రహాలను, చెట్టూ పుట్ల ఆరాధనను విడిచిపెడితే అప్పుడు కచ్చితంగా ఒక నామ మాత్ర హిందువు సైతం నిజమైన వైదికుడిగా మారిపోతాడు.
ఎందుకంటే హిందూ మతంలో దేవీదేవతల విగ్రహాల ఆరాధన నుండి చెట్టూపుట్ల, జంతువుల ఆరాధన వరకూ ఉండవచ్చునేమో గానీ వైదిక ధర్మం “మనసు చేత గ్రహింపశక్యము కానిది నిజదైవం, ఇక్కడ ప్రజలు పూజించేది దైవము కాదని తెలుసుకో (కేణోపనిషత్ 1:5,8)” అని చెబుతున్నాయి. జ్ఞానం లేనివారు మాత్రమే దేవతారాధన చేస్తారు జ్ఞానమున్న వ్యక్తులు నిజదైవాన్ని మాత్రమే ఆరాధిస్తారు (7:23)” అని గీతా శాస్త్రం సైతం చెబుతుంది.
అంతేకాదు “ఈ సృష్టిలో కనపడే ప్రాకృతిక వస్తువులను (సూర్యచంద్రులు, చెట్లూ,జంతువులు, వ్యక్తులు వగైరా వాటిని) ఎవరైతే పూజిస్తారో వారు చీకటిలో ప్రవేశిస్తారని, ఎవరైతే సంభూతిని పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు (యజుర్వేదం 40:9)” అని వైదిక ధర్మం హెచ్చరిస్తుంది.
ఇక్కడ మరింత గమనార్హమైన విషయం ఏమిటంటే.. వేదోపనిషత్తులు, గీతా శాస్త్రాలు “అద్వితీయుడని, అగోచరుడని, అక్షయుడని, పుట్టేవాడువాడు కాడని, నాశనం కానివాడని, ఫలానా విధంగా ఉంటాడని ఊహించటానికి సైతం అందని రూపం కలవాడని, అవ్యక్తుడని, మానవ శరీరంతో అవతరించేవాడు కాడని, అనేక పేర్లతో పిలువబడేవాడని ఏ సర్వేశ్వరుణ్ణైతే పరిచయం చేస్తున్నాయో … ఆయనే యెహోవా అన్న పేరుతో బైబిల్లోనూ … అల్లాహ్ అన్న పేరుతో ఖురాన్ లోనూ పరిచయమయ్యాడు అన్నది.
కాస్త సమయం తీసి బైబిల్, ఖురాన్ గ్రంథాల్లో దేవుని గుణగణాలు ఎవరైనా చదవగలిగితే పైన వేదోపనిషత్తుల్లో చెప్పబడిన దేవుని గుణగాణాలకు కించిత్తు తేడాను కనుగొనలేరు. పైగా శ్రీరాముడు, కృష్ణుడు నుండి నోవాహ్, అబ్రాహము, యేసు, ముహమ్మద్ ప్రవక్తల వరకూ ఈ అందరు మహనీయులు ఆయన్నే ఏ విగ్రహమూ పెట్టకుండా ప్రార్ధించేవారని, ఆయన్నే దైవంగా పరిచయం చేశారని కూడా కనుగొనవచ్చు.
ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఎవరైనా నేను ఇస్లాం వదిలిపెట్టి వైదిక ధర్మం స్వీకరిస్తున్నాను అని అంటే అతను తిరిగి ఇస్లాంనే ఒకనాటి వైదిక ధర్మం అన్న పేరుతో స్వీకరించటమే అవుతుంది. ఎందుకంటే ధర్మం సైతం అనాదిగా ఒకటే ఉంది. అదే ధర్మం అన్ని కాలాల్లోనూ సకల రుషులు, మహనీయులు, ప్రవక్తల ద్వారా బోధించబడుతూ వచ్చింది. అది ఒకప్పుడు వైదిక ధర్మం, ఆర్ష ధర్మమని పిలువబడితే, బైబిల్లో పురాతన మార్గమని, ఖురాన్ లో ఇస్లాం అని పిలువబడింది.
కాబట్టి ఇస్లాం స్వీకరించటం అంటే… కంటికి కనపడే వస్తువుల, వ్యక్తుల, జంతువు ఆరాధనను విడిచిపెట్టి “అద్వితీయుడు, అగోచరుడు, అక్షయుడు, పుట్టని, నాశనం కాని సృష్టికర్తను తన దైవంగా స్వీకరించి ఆయన్ని మాత్రమే ఆరాధించటం”, గత ప్రవక్తలూ, రుషుల నుండి యేసూ, ముహమ్మద్ ప్రవక్తలను ఆయన దాసులుగా నమ్మి వారి బోధనలు చదివి వారి ఆదర్శాలను పాటించటం అంతే. ఆ విధంగా నిజదైవానికి దగ్గరైన వ్యక్తి “యోగి”గా పిలువబడతాడు. అతనే అరబ్బీలో “ముస్లిం” అని పిలువబడతాడు.
కాబట్టి హిందువులైతే తమవద్ద ఉన్న హిందూ శాస్త్రాల ప్రకారం ఆ సర్వేశ్వరుని నిజ గుణగణాలు తెలుసుకోవాలి, క్రైస్తవులైతే యేసు పరిచయం చేసిన యెహోవా దేవుని గుణగణాలు తెలుసుకోవాలి, ముస్లిములైతే అల్లాహ్ యొక్క గుణగణాలు తెలుసుకోవాలి.
ఈ అవగాహన లేకుండా మతాలు మారటం, మతవిశ్వాసాలు కలిగి ఉండటం వల్ల ఒరిగేదేమీ ఉండదు.
హిందూ మతం స్వీకరించటం అంటే ఇదేనా? /-
