అయితే శ్రీ రాముడిలోని ఓ నాలుగు మంచి లక్షణాలు చెప్పండి…
• గొప్ప దయామయుడు, ప్రేమామూర్తి…
• నీతీ న్యాయాలు మెండుగా కలిగున్న వ్యక్తి…
• గొప్ప మానవతా విలువలు కలిగి ఉన్న మనిషి…
• శాంతి, సహనాలు కలిగిన గొప్ప మహనీయుడు…
మరి అలాంటి సుగుణాలున్న వ్యక్తిని ప్రేమించటం, ఆదర్శంగా తీసుకోవటం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని పుణికి పుచ్చుకోవటమని అర్థం.
తప్పితే పైకి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూనే పరాయి మతస్తులను హింసించటం, చంపటం, వారి స్త్రీలను రేపులు చేస్తామని బహిరంగంగా బెదిరించటం, వారిని జనహననాలు చెయ్యాలంటూ రెచ్చగొట్టటం, వారి సంస్కృతిపై, వారి ఆచారవ్యవహారాలపై, వారి వ్యాపారాలపై దాడి చెయ్యటం, వారిని అణచాలనుకోవటం, వారి అంగళ్లను కూల్చటం, వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం శ్రీ రాముని ఆదర్శం పాటించటం అవ్వదు. కానీ రాక్షస ఆదర్శం పాటించటం అవుతుంది.
శ్రీ రాముడిని ఆదర్శ పురుషుడు అంటారు. కానీ, పైకి శ్రీరాముడికి జై చెబుతూ మతోన్మాదాన్ని, తీవ్రవాదాన్ని ప్రదర్శించటం శ్రీ రాముడిని గౌరవించటం అవ్వదు పైగా ఆయన్ని హేళన చెయ్యటం అవుతుంది. అనాగరికం అవుతుంది.
హిందూ సమాజంలో శ్రీరాముడి పేరు వాడుకుంటూ మతోన్మాదం ప్రదర్శిస్తున్న కాషాయ దళానికీ.. అదే శ్రీరాముడి ఆదర్శాలను పాటించే ఉన్నతమైన హిందూ సోదరులకూ సంబంధం లేదు. ఈ ఇద్దరినీ ఒకే గాటన కట్టకూడదు.
ముస్లిం సమాజంలో అల్లాహుఅక్బర్ అని చెబుతూ ప్రవక్త ముహమ్మద్(స) ఆదర్శాలు పాటించే ఉత్తమ ముస్లిములకు.. పైకి ముస్లిం పేర్లు పెట్టుకుని అల్లాహుఅక్బర్ అన్న నినాదాలు చేస్తూ తీవ్రవాదం చేసే సన్నాసులకూ సంబంధం లేదు. ఈ ఇద్దర్ని కూడా ఒకే గాటన కట్టకూడదు.
ఏ మతవ్యవస్థలోనైనా మతోన్మాదులకు ఉన్మాదం చెయ్యమని ఏ మతమూ నేర్పదు. కానీ మతోన్మాదం అన్నదో మానసిక రోగం. అలాంటి మానసిక రోగుల్ని తయారు చేస్తూ పెంచుకుంటూ పోవటం ద్వారానే తమ ఉనికి కాపాడబడుతుందని ఆ రాజకీయ పార్టీకి బాగా తెలుసు.
కాబట్టే దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతున్నా, రోజుకో రూపాయి చొప్పున పెట్రోల్ రేట్లు పెరుగుతూ పోతున్నా వాటిపై గొంతెత్తటానికి బదులు జై శ్రీరామ్ అని గొంతు చించుకునే ఉన్మాదుల గుంపును తయారు చేస్తూ పోతుంది. ప్రజల్ని మత కలహాలలో, మత ఘర్షణల్లో నెట్టేసి తన ఉనికిని చక్కగా కాపాడుకుంటుంది.
