ఇస్లాం ఎలాంటి ఉన్నత నైతిక విలువలు నేర్పుతుందంటే… ఇంట్లో తలిదండ్రులు ముసలివారై ఉంటే వారిని కనీసం ‘ఛీ’ అని సైతం కసుకోవద్దని, బంధువులు, అపరిచితులైన పొరుగువారు, దాసదాసీ జనంతో, బీదలతో ఉదారబుద్ధితో వ్యవహరించమనటమే కాదు, చివరకు అనాథులు, మన ముందు నిలబడి చెయ్యిచాచి అర్ధించే యాచకులను సైతం కసురుకో వద్దని ఆదేశించటం జరుగుతుంది.
దేవాలయాలకు వెళ్లినప్పుడో, రోడ్డు మీద మనం వెళుతున్నప్పుడో, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరో చాలా మంది యాచకులు ఆర్థిస్తూ ఉంటారు. వీలైతే వారికి తోచినంత డబ్బులు ఇవ్వటమో, భోజనం పెట్టటమో చెయ్యాలి, ఆ అవకాశం లేనప్పుడు లేదని చెప్పాలి. తప్ప వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ కసురుకోకూడదు. అలాగే తలిదండ్రులు లేని అనాథులతో ఎంతో దయతో వ్యవహరించాలి తప్ప వారిపట్ల కఠినంగా వ్యవహరించకూడదు.
ఎందుకంటే వారు ఎంతో దయనీయమైన స్థితిలో ఉండి మన ముందు నిలబడి ఆర్థిస్తూ ఉండగా వారిని కసురుకుంటే వారి మనస్సు ఎంతగానో గాయపడుతుంది. అలా చెయ్యటం దైవానికి ఏ మాత్రం ఇష్టం లేని పని.
బీదవారిపట్ల, దాసదాసీజనం పట్ల, అనాథులు, చివరకు యాచకుల పట్ల సైతం ఉదారబుద్ధితో వ్యవహరించమనటం అన్నది ఇస్లాం నేర్పుతున్న నైతిక విలువలలో పరాకాష్ట స్థాయి అని చెప్పవచ్చు. కానీ సమాజంలో చాలా మంది చేసే తప్పేమిటంటే.. అనాథులను, యాచకులను కసురుకోవటం, బీదవారు, దాసదాసీ జనం పట్ల చిన్న చూపు కలిగి ఉండటం, వారిని అథములుగా జమకట్టి వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తుంటారు. కానీ ఇస్లాం ఎలాంటి నైతిక విలువలు నేర్పుటుందంటే సమాజంలో అనాథులు, యాచకుల పట్ల సైతం ఎంతో ఉదారబుద్ధితో వ్యవహరించమంటుంది. కనీసం వారిని కసురుకోవద్దని సైతం హెచ్చరిస్తుంది.
